డ్రగ్స్‌ కేసులో క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదు.. ఆ న్యూస్ ఫేక్

 

టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్ కేసులో.. సెలెబ్రిటీలు అందరికీ క్లీన్‌చిట్‌ వచ్చిందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు ఖండించారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఈ కేసులో సినీ తారలు సహా ఏ ఒక్కరికీ క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని ఎక్సైజ్‌ శాఖ అధికారులు స్పష్టంచేశారు. డ్రగ్స్‌ కేసులో 62 మందిని విచారించినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని, ఛార్జి షీట్‌లో సైతం బలమైన అంశాలను పొందుపరచలేదంటూ మీడియాలో నిన్న విస్తృతంగా జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు పేర్కొన్నారు. డ్రగ్స్‌ కేసులో ఇప్పటివరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేశామని, ఐదుకు పైగా అభియోగ పత్రాలు దాఖలు చేయాల్సి ఉందని వెల్లడించారు. ఇంకా పలు ఆధారాలు రావాల్సి ఉందని తెలిపారు. తమకు లభ్యమైన ఆధారాలను బట్టి ఎప్పటికప్పుడు అభియోగ పత్రాలు దాఖలుచేసి కోర్టుకు సమర్పిస్తున్నాం తప్ప ఎవరికీ క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని.. పూర్తి ఆధారాలతో ముందుకెళ్తున్నామని అధికారులు స్పష్టంచేశారు.