పాపికొండల బోటు ప్రమాదంలో దోషి మంత్రి అవంతి: మాజీ ఎంపీ సెన్సేషనల్ కామెంట్స్

 

పాపికొండల వద్ద జరిగిన బోటు ప్రమాదం లో దాదాపు 34 మంది మృతుల దేహాలు లభించగా ఇంకా 13 మంది జాడ తెలియాల్సి ఉందని చెప్తున్నారు. ఐతే తాజాగా ఈ ప్రమాదం పై మాజీ ఎంపీ హర్ష కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బోటులో ప్రయాణిస్తున్న వారి సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారని అన్నారు. ప్రమాద సమయంలో బోటులో 93 మంది ప్రయాణికులు ఉన్నారని, దీనికి సంబంధించి తన వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని అయన చెప్పారు. మృతుల సంఖ్యను తక్కువగా చూపెట్టేందుకే తప్పుడు సమాచారం ఇస్తున్నారని ప్రభుత్వం పై మండిపడ్డారు. సోమవారం మధ్యాహ్నానికే బోటు జాడ తెలిసిందని, అయితే బయటకు చెపుతున్న లెక్కకు మించి మృతదేహాలు బయటపడతాయనే భయంతో బోటును వెలికి తీయడం లేదని అయన విమర్శించారు. సంచలనాల కోసమో లేక పేరు సంపాదించడం కోసమో తాను ఈ విషయాలను వెల్లడించడం లేదని ఆయన అన్నారు. అంతే కాకుండా ఈ బోట్ల వ్యవహారం లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అయన ఆరోపించారు. దీనిలో ఫారెస్ట్, టూరిజం, ఇరిగేషన్ అధికారుల పెట్టుబడులు ఉన్నాయని, స్వయంగా ప్రబుత్వ అధికారులే వ్యాపారం చేస్తున్నారని, అందుకే వాస్తవాలు వెలుగులోకి రావడం వారికి ఇష్టం లేదని అయన మండిపడ్డారు. ఎక్కువ మందితో ప్రయాణం చేస్తున్న బోటుకు దేవీపట్నం ఎస్సై అనుమతి ఇవ్వలేదని, కానీ టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి బోటుకు పర్మిషన్ ఇప్పించేలా చేశారని హర్షకుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు.