బీజేపీలో చేరిన టీడీపీ ఫైర్‌బ్రాండ్‌!!

 

టీటీడీపీలో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోత్కుపల్లి బీజేపీలో చేరడానికి ముందు.. తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షాతో చర్చించిన తరువాత బీజేపీలో చేరారు. 

కొన్నాళ్లక్రితం టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మోత్కుపల్లి.. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీకి దూరం అయ్యాక మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. టీఆర్ఎస్ కు దగ్గరయ్యేందుకే చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసారని ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఆయన ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ నుంచి సంకేతాలు రావడంతో చర్చలు ఫలించి బీజేపీ గూటికి చేరినట్లు తెలుస్తోంది. మరి తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి మోత్కుపల్లి చేరిక ఎలాంటి లాభం తెస్తుందో వేచి చూడాలి.