ఆస్ట్రేలియాలో మరో దారుణ ఘటన...

 

సిడ్నీ కేఫ్‌లో ఒక ఉగ్రవాది చేసిన దారుణం, పాకిస్థాన్‌లో పెషావర్ స్కూల్లో తీవ్రవాదులు జరిపిన మారణహోమం దేశ వ్యాప్తంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాయి. ప్రశాంతంగా వుండే ఆస్ట్రేలియాలో జరిగిన సిడ్నీ కేఫ్ సంఘటన ఆ దేశ ప్రజలు కంటి నిండా కునుకు పోని పరిస్థితిని తెచ్చింది. ఇదిలా వుండగా, ఆస్ట్రేలియాలో మరో దారుణం జరిగింది. ఆస్ట్రేలియాలోని సౌత్ క్వీన్స్ లాండ్‌ కెయిర్న్స్ పట్టణంలోని ఒక ఇంట్లో ఎనిమిది మంది పిల్లలు చనిపోయి కనిపించారు. ఆ ఇంట్లో ఒక మహిళ గాయపడి వుందని సమాచారం అందుకుని అక్కడకి వెళ్ళిన పోలీసులకు అపస్మారక స్థితితో వున్న ఒక మహిళ కనిపించింది. ఆ తర్వాత ఆ ఇంట్లో ఎనిమిది మంది మగ పిల్లలు చనిపోయి కనిపించారు. ఆ పిల్లల వయసు ఏడాదిన్నర నుంచి 15 ఏళ్ళ వయసు వరకు వుంటుంది. వీరంతా సోదరులేనని తెలుస్తోంది. పదునైన ఆయుధాలతో వీరిని గాయపరచడంతో వీరు మరణించినట్టు సమాచారం. ప్రస్తుతం అపస్మారక స్థితిలో వున్న మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె స్పృహలోకి వస్తేగానీ అసలేం జరిగిందో తెలియదు. ఈ విషాద ఘటన ఆస్ట్రేలియా మరోసారి ఉలిక్కిపడేలా చేసింది.