కారులోంచి వెయ్యి నోట్లు విసిరేసిన వ్యక్తి...

 

పెద్ద నోట్లు రద్దుతో ప్రజలు చిల్లర కష్టాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ పెద్ద నోట్ల రద్దుతో చిత్ర విచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి ఏకంగా వెయ్యి రూపాయల నోట్లను విసిరేశాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో వచ్చి పోయే యాత్రికుల నడుమ కారులో వెళుతున్న ఓ వ్యక్తి వెయ్యి రూపాయల నోట్లను రోడ్డుపైకి విసిరేశాడు. దీంతో ప్రజలు వాటిని తీసుకోవడానికి పరుగులు తీశారు. మరోవైపు వీటిని సొంతం చేసుకున్న కొంత మంది అవి నిజమైన నోట్లా.. కాదా అనే సందేహంతో పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీశారు. అక్కడ అవి చెల్లడంతో నిజమైన నోట్లేనని నిర్ధారించుకున్నారు. మొత్తానికి పెద్ద నోట్లు రద్దవడంతో కొంతమంది పాత నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే.. కొంత మంది ఇలా విసిరేయడం.. కొంతమంది అయితే ఏకంగా వాటిని కాల్చేయడం లాంటి చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు.