ఆరోగ్యానికి ఆ నాలుగూ...

 

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అందులోనూ జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, వాల్‌నట్స్ ఈ నాలుగూ అందరూ తప్పక తినితీరాలి అంటూ పోషకాహార నిపుణులు పదేపదే చెబుతున్నా మనం పెద్దగా పట్టించుకోం. వీలయినప్పుడు తింటాం. లేదంటే లేదు. అవునా! కానీ గుండె ఆరోగ్యంగా వుండాలంటే జీడిపప్పులు రోజూ ఓ నాలుగు అయినా తినాలిట. వీటిలో వుండే ఒలోయిక్ ఆమ్లం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు శరీరానికి అవసరమై. రాగి, మెగ్నీషియమ్, జింక్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఈ జీడిపప్పుల నుంచి లభిస్తాయిట. కాబట్టి ఏ పనిలో వున్నా ఓ నాలుగు జీడిపప్పులను టక్కున నోట్లో వేసుకోవడం మరచిపోవద్దు.

 

ఇక బాదం ఎందుకు తినాలో తెలుసా? శరీరంలోని హానికర కొవ్వు నిల్వలని తగ్గిస్తుంది కాబట్టి. వీటిలోని మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం, రాగి లాంటి ఖనిజ లవణాలు, ఇ విటమిన్ గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయిట. గర్భవతులు రోజూ ఓ రెండు బాదం పప్పులు తింటే వీటిలోని ఫోలెట్, బి విటమిన్లు బొజ్జలోని పాపాయికి బర్త్ డిఫెక్ట్ లేకుండా చూసుకుంటాయి. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు, మెనోపాజ్ దశలో వున్నవారు ఎండుద్రాక్షని రోజూ తప్పనిసరిగా తినాలిట. ఎందుకంటే, ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించే బోరెన్ అనే ఖనిజ లవణం ఎండుద్రాక్షలో పుష్కలంగా దొరుకుతుంది. అలాగే వీటిలో కూడా యాంటి ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా వుంటాయి కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.


ఇక వాల్ నట్స్ తింటే రోగ నిరోధక శక్తి పెరగటమే కాదు. క్యాన్సర్ల వంటివీ దరిచేరవు. అలాగే ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి. అధిక రక్తపోటు, హానికారక కొలెస్ట్రాల్ స్థాయులు నియంత్రణలో వుంటాయి. గుండె ఆరోగ్యంగా వుంటుంది. వీటన్నిటికీ కారణం వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్‌లు అధికంగా వుండటమే.


-రమ