తెలంగాణ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు

 

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే టీఆర్ఎస్ దాదాపు 80 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారం చేపట్టేలా కనిపిస్తోంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఫలితాలపై స్పందించిన ఉత్తమ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్‌ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. వీవీప్యాట్‌ల్లోని స్లిప్‌లను కూడా లెక్కించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాకూటమి అభ్యర్థులంతా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. వీవీప్యాట్‌లను లెక్కించే వరకూ పట్టుబట్టాలన్నారు. ఎవరు ఓడిపోతారో టీఆర్ఎస్ నేతలు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇదంతా ట్యాంపరింగ్‌ను బలపరుస్తున్నాయని ఉత్తమ్ విమర్శించారు.