ఇదెక్కడి గోల.. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా పాజిటివ్..

posted on: Mar 23, 2021 10:10AM

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో ప్రజలు మళ్ళీ ఏడాది క్రితం ఉన్న పరిస్థితులు వస్తాయేమోనని భయపడుతున్నారు. మరోపక్క  ప్రభుత్వాలు వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి, ఇది ఇలా ఉండగా ఢిల్లీ పరిధిలోని ఒక సర్కార్ దవాఖానాలో పనిచేస్తున్న నర్సు నిర్ణీత సమయంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా కరోనా బారినపడ్డారు. ఈ నర్సు జనవరి 18న తొలిడోసు వ్యాక్సిన్ తీసుకోగా..  ఫిబ్రవరి 17న రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. తాజాగా ఆమె కరోనా గుప్పిట్లో చిక్కుకున్నారు. ఎప్పటిలానే ఆమె ఆసుపత్రిలో డ్యూటీ చేస్తుండగా.. ఆమెకు కొన్ని లక్షణాలు కనిపించడంతో..  వెంటనే ఆమె కోవిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయించుకోగా కరోనాకు గురైనట్టు నిర్ధారణ అయింది.

మరోపక్క యూపీ రాజధాని లక్నోలోనూ ఇటువంటి ఘటనే వెలుగు చూసింది. ఇక్కడి ఎస్‌పీఎం సివిల్ ఆసుపత్రికి చెందిన ఒక వైద్యుడు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా ఆయనకు కూడా కరోనా సోకింది. సివిల్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ నితిన్ మిశ్రా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నతరువాత కూడా వైరస్ బారిన పడ్డారు. అయన ఫిబ్రవరి 15న తొలి డోసు, మార్చి 16న కోవ్యాక్సిన్ రెండవ డోసు తీసుకున్నారు. ఆ తరువాత ఆయనకు అనారోగ్యంగా అనిపించడంతో.. కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా వైరస్ సంక్రమించిన ఘటన యూపీలో ఇదే మొదటిదని యూపీ మెడికల్ హెల్త్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డీఎస్ నేగి తెలిపారు. కరోనా బారినపడిన వీరిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

అయితే దీనిపై ఇప్పటివరకు నిపుణులు మాత్రం.. మొదటి డోసు వ్యాక్సిన్ వేసుకున్న 28 రోజులకు రెండో డోసు వేసుకోవాలని.. ఆ తరువాత 14 రోజులకు (అంటే మొదటి డోసు వేసుకున్న 42  రోజులకు) మనలో కరోనాపై పోరాడే శక్తి వస్తుందని.. దీంతో కరోనా నుండి రక్షణ లభిస్తుందని చెపుతున్నారు. అయితే ఈ తాజా ఘటనలతో ప్రజలలో కొంత అయోమయం నెలకొనే అవకాశం ఉంది.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...