దేవినేని నెహ్రు ముందస్తు వ్యూహాలు
posted on Jun 20, 2013 1:04PM
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటి చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందిన మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రు). ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటి వరకు డివిజన్ సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన ప్రజల వద్దకు నేరుగా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడు, రాజకీయవారసుడైన దేవినేని అవినాష్ ని రంగంలోకి దింపుతున్నారు.
విజయవాడ పార్లమెంట్ స్థానం యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా బాద్యతలు నిర్వర్తిస్తున్న దేవినేని అవినాష్, ఈరోజు ఇంటింటికీ కాంగ్రెస్ పథకాల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. 18 డివిజన్లలో అక్టోబర్ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ''కృష్ణలంకలోని గంగానమ్మగుడి వద్ద నుంచి ఇంటింటికీ ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతుందని, శుక్రవారం నుంచి రోజు సాయంత్రం అయిదు నుంచి తొమ్మిది వరకూ ఆయా డివిజన్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తామని, మద్యలో తన తండ్రిని కలుస్తానని '' దేవినేని అవినాష్ చెప్పారు.
రానున్న ఎన్నికల్లో టిక్కెట్ విషయంమై ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే గా వున్న యలమంచిలి రవి, మాజీ మంత్రి దేవినేని నెహ్రు మధ్య తీవ్ర పోటి నెలకొనివుంది. దీంతో టిక్కెట్ దక్కించుకోవడానికి దేవినేని నెహ్రు ముందస్తు వ్యూహాలు మొదలుపెట్టారు.