మనుషులా? మృగాలా?

రోజురోజుకి మానవత్వం మంటకలిసిపోతోంది. తాము ఎంత చెప్పినా వినకుండా పరీక్ష రాసిందని కోపంతో నలుగురు దుర్మార్గులు ఓ దళిత బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటిచారు. ఉత్తరప్రదేశ్ లోని ఖుషినగర్ జిల్లా పత్తార్ దెవా గ్రామంలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో వంట చేస్తున్న బాలికను బయటకు ఈడ్చుకొచ్చి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాలికకు 70 శాతం శరీరం కాలిపోగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితులు ధీరజ్ యాదవ్, అతని సోదరులు అర్వింద్, దినేష్, వారి తండ్రి రాంపర్వేష్ యాదవ్ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. స్కూల్లో వాళ్లు రాసిన ప్రతి పరీక్షలో ఫెయిలయ్యారని, కానీ తాను పాసయ్యానని, తాను వాళ్లకంటే బాగా చదువుకోవడం వాళ్లకు ఇష్టం లేదని బాధితురాలు చెప్పింది. కొన్ని నెలల క్రితం ధీరజ్ తన ఫోటో తీసి బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించాడని, ఈ సందర్భంగా తమ రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగిందని వెల్లడించింది. ధీరజ్ తనపైన కూడా దాడి చేశాడని బాధితురాలి సోదరుడు తెలిపాడు.