భయంకరంగా సెకండ్ వేవ్! జనాలకు ఈటల వార్నింగ్
posted on Apr 18, 2021 2:36PM
తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. శనివారం 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో 15 మంది చనిపోయారని వైద్యశాఖ ప్రకటించింది. అయితే అనధికారిక లెక్కల ప్రకారం కేసులు, మరణాలు భారీగా ఉన్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ విజృంభణలో వైద్య శాఖను అప్రమత్తం చేశారు మంత్రి ఈటల రాజేందర్. బెడ్లు, వ్యాక్సిన్, ఆక్సిజన్ వంటి సదుపాయాలపై ఆయన అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జనాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఈటల రాజేందర్.
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందన్నారు ఈటల. సెకండ్ వేవ్లో వైరస్ తీవ్రత అధికంగా ఉన్నందున ఆక్సిజన్ సరఫరా విషయంపైనా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో నిత్యం 200 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందన్నారు. కేసులు పెరిగితే 350 టన్నుల వరకు అవసరం ఉండొచ్చని తెలిపారు .ఆక్సిజన్ సరఫరా విషయం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదన్నారు ఈటల. ప్రైవేట్, ప్రభుత్వ దవాఖానల వైద్యులు కరోనా రోగులకు ఐసీఎంఆర్ విధి విధానాలకు అనుగుణంగా వైద్యం అందించాలని సూచించారు. రోగి పరిస్థితి, అవసరాన్ని బట్టి ఆక్సీజన్ అందించాలన్నారు మంత్రి. ఆక్సీజన్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత సైతం వైద్యులపై ఉందన్నారు. ఆక్సిజన్ అవసరం మేరకు వాడుకోవాలన్నారు.
కరోనా రోగులకు చికిత్సనందించే ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనా తగ్గిందనుకున్న సమయంలో రెండో వేవ్ మొదలైందని అన్నారు. సెకండ్ వేవ్లో వైరస్ బారినపడిన వారిలో 5 శాతం మందిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి, ఫ్రంట్ లైన్ వారియర్స్కు 100 శాతం టీకాలు పంపిణీ చేస్తాం.
ప్రతి పీహెచ్సీలో వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు ఈటల రాజేందర్. ప్రస్తుతం రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రోజుకు 10 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఉందని చెప్పారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత సమస్యను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు ఈటల. వ్యాక్సిన్ కొరత కారణంగానే పంపిణీ నిలిచిపోయిందన్నారు. టీకా నిల్వలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ఈటల చెప్పారు.