కరోనా దెబ్బకి ఇలా కూడా జరిగింది!
posted on Apr 6, 2020 1:20PM
మద్యం షాపులు బంద్ కావడంతో సంపూర్ణ మద్య నిషేధం అమలు అయింది. దిక్కుమాలిన తెలుగు సీరియల్స్ ఆగిపోయాయి. పెద్ద నగరాల్లో ఆఫీస్ నుంచి ఇంటికి చేరే సమయంలో నాలుగు గంటల దాకా బయటే ట్రాఫిక్ లో గడిచిపోయే పరిస్థితి వుండేది. ఇప్పడు రోడ్లన్నీ ఖాళీగా వున్నాయి. అత్యవసరం వున్న వారే రోడ్ల మీద కనిపిస్తున్నారు.
ఎంత పెద్ద పట్టణం అయినా ఏ చౌరస్తా చూసిన ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేదు. కాలుష్య రహిత నగరాలుగా మారాయి.
ఇంట్లో వుండి కుటుంబంతో సరదాగా ఆట పాటలతో గడుపుతున్నారు. పిల్లల చదువు గురించి తెలుసుకోవడం, పిల్లలు ఎలా వుంటున్నారో చూసే అవకాశం ఇంటి పెద్దకు దొరికింది.
మగవాళ్ళు ఇంటి పనుల్లో, వంట పనుల్లో సాయం చేయడంతో భార్యాభర్తల మధ్య అనురాగం పెరిగిందట. డబ్బులు నగలు, షాపింగ్, ఇతర అనవసర వస్తువులు మీద తగలకుండా, అవసరమైనవి మాత్రమే కొనుక్కోవడంతో పొదుపు చేసే అలవాటు అవుతుందట. డబ్బులు అతి జాగ్రత్తగా పొదుపు గా వాడుకోవడం. బయట అడ్డమైన దరిద్రాలు తినకపోవడం లాక్డౌన్ వల్లే సాధ్యమైందని జనం చెప్పుకుంటున్నారు.
వ్యక్తిగత శుభ్రత మీద, పరిసరాల శుభ్రత మీద జాగ్రత్తలు తీసుకోవటం. బండిలో పెట్రోల్ తగలేసి తిరగడం తగ్గిందని ఇంట్లోవాళ్ళు సంతోషపడుతున్నారు. జనం సాధ్యమైనంతవరకు నాన్వెజ్ మానేసి వెజ్ తినడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్నప్పుడు బామ్మ చెప్పిన సాంప్రదాయ పద్ధతులు గుర్తు తెచ్చుకుని మరీ పాటిస్తున్నారట. సామాజిక బాధ్యత గురించి ఆలోచించడం, పక్కవారికి రోగాలు రాకూడదు, వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుకోవడం కరోనా వైరస్ నేర్పించిదంటున్నారు. పని మనిషి లేకపోయినా సంతోషంగా ఇంటి పనులు కలసి మెలసి అంతా చేసుకోవడం ఇప్పుడిప్పుడే అలవాటౌతోంది.