2301కు చేరిన కరోనా కేసులు! తబ్లీగి జమాత్తో సంబంధం ఉన్నవి 647!
posted on Apr 3, 2020 8:40PM
దేశంలో గత 24 గంటల్లో 336 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2301కి చేరగా వీటిలో 647 కేసులకు తబ్లీగి జమాత్తో సంబంధం వున్న వారివి. అయితే ఇప్పటి వరకూ 56మంది కరోనా కారణంగా చనిపోయారని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
ఇప్పటి వరకూ 157 మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆయన చెప్పారు. కరోనా కేసుల్లో 647 కేసులకు తబ్లీగి జమాత్తో సంబంధం ఉందని లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలోని 14 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయని చెప్పారు.
కరోనా బాధితులకు సేవలు చేస్తున్న వైద్య సిబ్బందికి అడ్డంకులు సృష్టించవద్దని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. వైద్య సిబ్బంది మీద దాడులను ఖండించింది. ఎవ్వరూ అలాంటి చర్యలకు పాల్పడవద్దని కోరింది. ఒకవేళ ఎవరైనా వైద్యుల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.