కమిట్మెంట్ లేని కమిటీలు దేనికోసం?
posted on Aug 7, 2013 5:42PM
....సాయి లక్ష్మీ మద్దాల
ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ అధిష్టానం తరఫున ఈరోజు ఒక అధికారిక ప్రకటన చేశారు. అదేమంటే సీమాంద్రలో విభజన ప్రకటన వెలువడిన అనంతరం వెల్లువెత్తిన ఉద్యమ సెగల దృష్ట్యా ఒక కమిటీని వేస్తున్నాం అని. ఈ కమిటీకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి AK ఆంటోని చైర్మన్ గా ఉంటారని,వీరప్పమొయిలి,అహమద్ పటేల్,గులాంనబీ ఆజాద్ అనబడే ముగ్గురు వ్యక్తులతో కలిపి మొత్తం నలుగురు వ్యక్తులతో ఈ కమిటి ఉంటుందని ప్రకటించటం జరిగింది. ఈ కమిటి యొక్క కార్యాచరణ ఏమిటి అంటే,సీమాంద్ర ప్రజల అభ్యంతరాలు తెలుసుకోవటం ,విద్యార్ధి జెఎసి తో,ఉద్యోగస్తుల జెఎసి తో,మరియు వివిధ వర్గ ప్రజలతో సమావెశమై వారి అభిప్రాయ సేకరణ చేయటం. అయితే మొన్న CWC చేసిన తీర్మానం వాయిదా వేస్తారా అంటే, లేదని CWC చేపట్టిన తీర్మాన ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదని చెబుతున్నారు. మరి ఈ కమిటీ ఎవరి కంటి తుడుపు కోసమని ఆ ప్రాంత ప్రజలు అనుకోవాలి? ఎపి ఎన్జీవోలు సమ్మె విరమించుకోవాలని దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు. అలాగే సీమాంద్ర ప్రాంత ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. కమిటీ ద్వారా ఏ కార్యాచరణ అయితే చేపట్టాలని అనుకుంటున్నారో దాని గురించి ప్రకటన వెలువరించక ముందు ఎందుకు ఆలోచించ లేదు? ఒక ప్రాంతం లో వీరి నిర్వాకం కారణంగా ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున లేచి,అక్కడి ప్రజాజీవనం స్తంభించిన తరువాత కాని తమకి ఈ కమిటీ డ్రామా గుర్తుకొచ్చినందుకు వారినేమనాలి. అయినా విభజన ప్రకటనకు ముందు విభజన అనే వ్యవహారానికి పూర్తిగా వ్యతిరేకించినది కేంద్ర రక్షణశాఖ మంత్రి AKఆంటోని. మరి ఇప్పుడు ఆయనే చైర్మన్ గా ఉండబోయే కమిటీ ద్వారా సీమాంద్ర ప్రాంత ప్రజలకు చేకూరబోయే ప్రయోజనం ఏమిటి
కాని ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం మరో కమిటీ కూడా వేసింది. అదే 2014 ఎన్నికల మానిఫెస్టో కమిటీ. మళ్ళి దీనిలో సభ్యులుగా ఉండే వారు బొత్స, కిరణ్, ఉండవల్లి. ఈ కమిటీకి చైర్మన్ మళ్ళి ఆంటోనీనే. కాని ఈ కమిటీకి సభ్యులుగా ఉన్న కిరణ్, బొత్స, ఉండవల్లులను ఏమనాలి? మొన్నటి వరకూ సమైఖ్యాంద్ర కోసం తామేదో కష్టపడిపోతున్నట్లు నాటకాలాడిన వీరిని ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా కాంగ్రెస్ అధిష్టానం నియమించినదంటే, వీరంతా అధిష్టానానికి పాదాక్రాంతులనే కదా అర్థం.
అంటే ఒక పక్క అభద్రతా భావంతో,తమ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనతో ఉన్న ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా,మరోసారి ఇలాంటి కమిటీలతో అంటే ఎన్నికలే పరమావధిగా ప్రజలముందుకు వెళ్ళే అర్హత సదరు నేతలకు ఎక్కడిది?ప్రజలు కలిసుండాలని కోరుకుంటుంటే విడిపోవాలని కోరుకునే నీచమైన నేతలు బహుశా చరిత్రలో వీరే కావొచ్చు. ఏది ఏమైనా ఈ మొత్తం వ్యహారాన్ని బట్టి ప్రజలకు పూర్తిగా అర్ధమైంది ఏమంటే బొత్స,కిరణ్ కుమార్ రెడ్డి,ఉండవల్లి మాత్రం సమైఖ్యాంద్ర ద్రోహులు అని.