సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్... వీళ్ల కంటే వీధి రౌడీలు బెటర్‌ 

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు సభలో నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఓవైపు రైతు భరోసా కేంద్రాలపై సభలో చర్చ కొనసాగుతుండగా.. మరోవైపు టీడీపీ సభ్యులు అమరావతి కోసం ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. టీడీపీ సభ్యులు జై అమరావతి, జైజై అమరావతి నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్లారు. దీంతో మరోసారి టీడీపీ సభ్యులపై  స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం వైఎస్ జగన్ టీడీపీ సభ్యులపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. చేతనైతే సలహాలు ఇవ్వాలి... చేతకాకపోతే సభ బయట ఉండాలని సూచించారు. స్పీకర్‌ను అగౌరవపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సంస్కారం లేని ఇలాంటి వ్యక్తులు సభకు ఎందుకు వస్తున్నారో? అర్థం కావడంలేదని అన్నారు. సభ్యులు స్పీకర్‌ పోడియం రింగ్‌ దాటి వస్తే మార్షల్స్‌ను పెట్టి సభ్యులను బయటకు పంపాలని స్పీకర్ కి సూచించారు. టీడీపీ సభ్యులు మొత్తం కలిపి 10 మంది కూడా లేరని.. వీళ్ల కంటే వీధి రౌడీలు చాలా బెటర్‌ అని జగన్‌ వ్యాఖ్యానించారు.