సారీ.. నేను రాను... సీఎం రమేష్ కుమారుడి పెళ్లికి రానని చెప్పిన జగన్!!

తెలుగుదేశం నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ , ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఇద్దరిది ఒకే జిల్లా కానీ ఇద్దరి మధ్య రాజకీయ వైరం తారాస్థాయిలో ఉంది. వైఎస్ రాజశేఖరెడ్డి టైం నుంచే సీఎం రమేష్ తో పొలిటికల్ రైవలరీ ఉండేది. టిడిపిలో ఉన్నంత వరకు జగన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యేవారు రమేష్. బిజెపిలో చేరిన తర్వాత సీఎం రమేశ్ కాస్త సైలెంట్ అయినా అప్పుడప్పుడు విమర్శల బాణాలు వేస్తూనే ఉన్నారు. ఇలా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నేపథ్యంలో సీఎం రమేష్ ఏకంగా సీఎం జగన్ ను అమరావతి వెళ్లి కలవడం.. ముసిముసి నవ్వులు నవ్వుకోవడం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

సీఎం రమేష్ కుమారుడి వివాహం వచ్చే నెల మొదటి వారంలో జరగబోతోంది. దుబాయి లో ఎంగేజ్ మెంట్ ను అంగరంగవైభవంగా చేశారు రమేష్ . పెళ్లి వేడుకను అంతకు మించి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి వెడ్డింగ్ కార్డు ఇచ్చారు సీఎం రమేష్. అమరావతి సచివాలయంలోని సీఎం ఆఫీసుకు కొడుకుతో పాటు సతీసమేతంగా వెళ్లి జగన్ కు ఆహ్వాన పత్రిక అందించారు. పక్కనే ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. తన కుమారుడి వివాహానికి తప్పకుండా రావాలని పిలిచారు. కానీ సీఎం జగన్ రియాక్షన్ తో షాక్ అయ్యారట సీఎం రమేష్. పెళ్లికి రాలేనని చెప్పారట సీఎం జగన్. రావాలని పదేపదే అడిగినా జగన్ మాత్రం సారీ అన్నారని సమాచారం. 

పెళ్ళికి రాలేను అని జగన్ చెప్పిన దానిపై చాలా విషయాలు ప్రచారంలో ఉన్నాయి. పెళ్లికి టిడిపి అధినేత చంద్రబాబు అలాగే ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు తన రాజకీయ ప్రత్యర్థులు వస్తారని అందుకే తాను రాలేనని సీఎం రమేష్ కు నవ్వుతూనే చెప్పారట జగన్. రాజధానుల అంశం ఇంగ్లీష్ మీడియంపై ఈ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఒకే వేదికలో కూర్చోవడం మాట్లాడటం తనకే కాదు వాళ్ళకి ఇబ్బందేనని అన్నారట జగన్. అయినా రావడానికి ప్రయత్నించాలని చెప్పి నవ్వుతూ వెళ్లిపోయారు సీఎం రమేష్ దంపతులు. 

ఈ మధ్య సీఎం రమేష్ ముఖ్యమంత్రి జగన్ కు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారని మాటలు వినపడుతున్నాయి. కొడుకు మ్యారేజ్ కి ఆహ్వానించడమే కాదు సీఎం జగన్ శంకుస్థాపన చేసిన కడప స్టీల్ ప్లాంట్ కార్యక్రమానికి హాజరయ్యారు రమేష్. కడపతో పాటు అనేక చోట్ల సీఎం రమేష్ కు కాంట్రాక్టు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు ఇంకా డబ్బులు రావలసి ఉండటంతో ఇదంతా చేస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. కానీ జగన్ ప్రభుత్వ మాత్రం బిల్లులు క్లియర్ చేయటం లేదట.

దీంతో జగన్ తో వైరం పెంచుకుంటే బిల్లులన్నీ మరింత కాలం పెండింగ్ లో పడతాయని భావించిన సీఎం రమేష్ వైసీపీ అధినేతతో కయ్యం కన్నా వియ్యమే మేలని ఆలోచిస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా రాయబారం నడుపుతూ జగన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు బీజేపీ అధిష్టానం కూడా జగన్ పట్ల పాజిటివ్ గా ఉన్నప్పుడు తానెందుకు నెగిటివ్ గా ఉంటానని ఆలోచిస్తున్నారు. అందుకే జగన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్నటి వరకు తీవ్ర విమర్శలు చేసి ఇప్పుడు క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సీఎం రమేష్ ను మాత్రం జగన్ దూరం పెడుతున్నారు. అందుకే కొడుకు పెళ్లికి సైతం రాలేనని సున్నితంగా బదులిచ్చారు సీఎం జగన్.