యశోద ఆస్పత్రికి కేసీఆర్.. టీఆర్ఎస్ కేడర్ లో టెన్షన్
posted on Apr 21, 2021 8:30PM
కరోనా సోకిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలతో కేసీఆర్ కొద్ది రోజులుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్హౌస్లో ఐసోలేషన్లో ఉన్నారు. సీఎంకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఆయను ప్రత్యేక డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తుందని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన వ్యక్తిగత డాక్టర్ ఎమ్వీ రావు తెలిపారు. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో సీఎం కేసీఆర్కు టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఫామ్ హౌస్లో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు. ఒక వైద్య బృందం కేసీఆర్ ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తోందని డాక్టర్ ఎమ్వీ రావు తెలిపారు.
అయితే ఫామ్ హౌజ్ నుంచి కేసీఆర్ యశోద హాస్పిటల్ కు రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా లక్షణాలు తీవ్రం అయ్యాయోనన్న టెన్షన్ టీఆర్ఎస్ కేడర్ లో వ్యక్తమవుతోంది. అయితే కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, సాధారణ హెల్త్ చెకప్తో పాటు సిటీ స్కాన్ చేయించుకోనున్నారని వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్హౌస్కు చేరుకుంటారని చెబుతున్నారు.