వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా.. నెలకు రూ.5000 ఇవ్వనున్న జగన్ ప్రభుత్వం

 

నేడు ( డిసెంబర్ 2న ) మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేద రోగులకు ఊరట కల్పించే పథకానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించనున్నారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ పథకం ద్వారా రోజుకు 225 లేదా నెలకు గరిష్ఠంగా రూ.5000 రూపాయలను సాయంగా అందజేస్తారు. 3 నెలల పాటు రూ.5000 చొప్పున అందించనున్నారు. 

శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోగులకు ఈ తరహా చేయూత అందించడం భారతదేశంలో ఇదే ప్రథమం. కుటుంబ పెద్ద జబ్బు బారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెడుతోంది. ఈ స్కీమ్ తో ఏటా నాలుగున్నర లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో విశ్రాంతి తీసుకునే కాలానికి రోగుల ఎకౌంట్ లో నేరుగా నగదు జమ చేస్తారు. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తించనుంది. దీనికి సంబంధించిన మార్గ దర్శకాలను ప్రభుత్వం రెండ్రోజుల క్రితమే జారీ చేసింది. రోగి డిశ్చార్జి సమయంలో బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాల్సి వుంటుంది. ఒకవేళ బ్యాంకు ఖాతా లేకపోతే బంధువుల బ్యాంక్ ఖాతా ఇస్తే దానికి సొమ్మును జమ చేస్తారు. ఈ పథకం అమలులో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా లబ్దిపొందుతున్న రోగులతో మాట్లాడారు. ఆరోగ్య శ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేసుకున్న రోగులకూ ఆయన చెక్కులు అందించనున్నారు. అంతేకాదు ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన క్యాన్సర్ వార్డును ప్రారంభించనున్నారు. అనంతరం గుంటూరు మెడికల్ కాలేజ్ జింకానా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. చిన్న పిల్లలకు సంబంధించిన కాక్లియర్ ఇంప్లాంట్స్ కు సంబంధించి బ్రోచర్ ను ఆవిష్కరిస్తారు. అనంతరం అదే వేదిక పై నుంచి ప్రసంగిస్తారు, సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం వచ్చే రూట్లలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.