సీఎం జగన్ తిరుపతి పర్యటన రద్దు.. ఎందుకంటే...

సీఎం జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. కొవిడ్ కేసుల కారణంగా తను తిరుపతి పర్యటనను క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 

కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున తాను తిరుపతి రాలేకపోతున్నానని లేఖలో తెలిపారు. 24 గంటల్లో కరోనాతో 11 మంది మరణించారు. అందులో నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాళ్లు ఉన్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. నెల్లూరు జిల్లాలో కూడా ఒక్కరోజులోనే 292 కేసులు వచ్చాయన్నారు. ఇవాళ కరోనా బులెటిన్‌ చూశాక.. తిరుపతి నియోజకవర్గ ప్రజలకు లేఖ రాస్తున్నా అన్నారు. 

‘‘మీరంతా నా వాళ్లే.. నేను సభకు హాజరైతే వేలాది మంది వస్తారు. మళ్లీ కోవిడ్‌ కేసులు పెరిగే ప్రమాదం ఉంది’’ అని లేఖలో రాశారు. బాధ్యతగల సీఎంగా తిరుపతిలో సభ రద్దు చేసుకుంటున్నానని తెలిపారు. ఇటీవల తాను రాసిన లేఖలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ వివరించానన్నారు. వాటిని గమనించి తన సోదరుడు గురుమూర్తిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.