జగన్‌కి ఓటమి భయమా? అందుకే తిరుపతి పర్యటన రద్దా?

ఈ నెల 14న ముఖ్యమంత్రి జగన్ తిరుపతి పర్యటన. 10 రోజుల క్రితమే ప్రకటన వెలువడింది. సీఎం వస్తారంటూ వైసీపీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగుతానన్నారు. కానీ, అంతలోనే ఏమైందో ఏమో గానీ, కరోనా సాకుతో తిరుపతి ప్రచారం నుంచి సైడ్ అయిపోయారు జగన్‌రెడ్డి. 

నిజంగా కరోనా కేసులే కారణమా? వారం క్రితమూ కొంచెం అటూఇటూగా ఇన్నే కేసులు ఉన్నాయి. అయినా, పర్యటన వాయిదా వేసుకోలేదు. ఇటీవలే పరిషత్ ఎన్నికలు జరిగాయి. వైసీపీ నేతలంతా జోరుగా ప్రచారం చేశారు. అప్పడు లేని సమస్య ఇప్పుడే వచ్చిందా అన్న చర్చ జరుగుతోంది.  సడెన్‌గా సీఎం జగన్ ఎందుకు తిరుపతి టూర్‌కు డుమ్మా కొట్టినట్టు? అనే అనుమానం ప్రజల్లో.  ఓటమి భయమే జగన్‌ను తిరుపతి వచ్చేలా టెంప్ట్ చేసిందని.. ఇప్పుడు అదే ఓటమి భయం సీఎంను తిరుపతి టూర్‌కు డుమ్మా కొట్టేలా చేసిందని అంటున్నారు. 

ఇంటెలిజెన్స్ సర్వేలో వైసీపీ కేండిడేట్ గురుమూర్తికి గెలుపు అవకాశాలు తక్కువేనంటూ నివేదికలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. తనకు పాదసేవ చేశాడనే ఏకైక కారణంతో ప్రజలకు పెద్దగా పరిచయంలేని ఫిజియోథెరపిస్టు గురుమూర్తిని పోటీలో నిలపడంపై ఓటర్లు పెదవి విరిచారు. ప్రచారంలో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు టీడీపీ ఎన్నికల ప్రచారంలో దుమ్ము రేపుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లు తిరుపతిలోనే మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్‌లకు తిరుపతిలో అడుగడుగునా ప్రజలు నుంచి విశేష స్పందన వస్తోంది. టీడీపీలో గెలుపు ధీమా పెరిగింది. 

అటు, బీజేపీ-జనసేన కూటమి సైతం ప్రచారంలో దూసుకుపోతోంది. రత్నప్రభకు మద్దతుగా జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేశారు. కమలనాథులు క్షేత్ర స్థాయిలో చాపకింద నీరులా ప్రచారం చేసుకుపోతున్నారు. టీడీపీ, బీజేపీలో హోరాహోరీగా పోటీపడుతుండగా.. వైసీపీ చాలా వెనకబడింది. అయినా, 5లక్షల మెజార్టీ అంటూ అధికార పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. గురుమూర్తి గెలుపు కష్టసాధ్యం కావడంతో జగన్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఒకవేళ తాను ప్రచారం నిర్వహించినా వైసీపీ అభ్యర్థి ఓడిపోతే తన పరువు పాతాళానికి పడిపోతుందని భయపడుతున్నారట. అందుకే, ఎందుకైనా మంచిదని తిరుపతి ప్రచారం విషయంలో పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. కరోనా కేసులను సాకుగా చూపి.. తిరుపతికి రాలేనంటూ లేఖ రాసి.. హమ్మయ్యా అని చేతులు దులిపేసుకున్నారని భావిస్తున్నారు.