1,088 కొత్త అంబులెన్స్‌లను ప్రారంభించిన సీఎం జగన్

108, 104 వాహనాలను సీఎం వైఎస్ జగన్‌ ప్రారంభించారు. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ జెండా ఊపి అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను అందించేందుకు 1,088 కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొత్త అంబులెన్స్‌ల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. మండల కేంద్రానికి ఒక వాహనం ఏర్పాటు చేయనున్నారు. 

108, 104 వాహనాలను ప్రారంభించిన తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ.. గతంలో ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్స్ ఉండగా, ఇప్పుడు 74,609 మందికి ఒక అంబులెన్స్ ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. 412 అంబులెన్స్ లు 108 సేవల్లో భాగంగా అనారోగ్యానికి, ప్రమాదాలకు గురైన వారిని ఆసుపత్రులకు చేరుస్తాయని చెప్పారు. మరో 282 అంబులెన్స్ లు బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ను కలిగివుంటాయని, మిగతావి అడ్వాన్డ్స్ లైఫ్ సపోర్టుతో ఉంటాయని తెలిపారు. 26 అంబులెన్స్ లు చిన్నారుల కోసం కేటాయించామని సీఎం పేర్కొన్నారు.