చిరు అన్నయ్యా.. బుర్ర తినకు!

 

 

 

మాజీ మెగాస్టార్, అభిమానుల పాలిట దగాస్టార్ చిరంజీవికి నీ అభిమాని రాస్తున్న ఉత్తరం. ప్రజారాజ్యం పార్టీ పెట్టి, దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, ఆ తర్వాత దగ్గరుండి రాష్ట్ర విభజన చేసి నువ్వు మా హృదయాలను ఇప్పటికే చాలాసార్లు గాయపరిచావు. నువ్వు చేసిన గాయాలు మాన్పుకునే పనిలో వున్నాం. అలాంటి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయకుండా నిన్న ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేశావ్. మమ్మల్నందర్నీ పిలిచి మాట్లాడావ్. నువ్వు కలవటం మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డితో కూడా మీటింగ్ ఏర్పాటు చేశావ్. అంతా అయిన తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ కి కూడా ఈ ఎన్నికలలో టిక్కెట్లు ఇస్తామని రఘువీరా చేత ప్రకటింపజేశావ్?


ఇదంతా చూశాక మాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు మారలేదన్నయ్యా.. నువ్వు మారతావన్న నమ్మకం కూడా నిన్నటి మీటింగ్‌తో  పోయిందన్నయ్యా. నువ్వు మామీద ప్రేమతో మీటింగ్‌కి పిలిచావని, మామీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇస్తానని అనిపించావని మేమేమీ అనుకోవడం లేదు. నీ అపరిపక్వ రాజకీయాల్లో భాగంగానే ఈ మీటింగ్ ఏర్పాటు చేశావని మాకు తెలుసన్నయ్యా. మేమందరం ఎక్కడ పవన్  కళ్యాణ్ తమ్ముడికి చేరువైపోతామోనని భయపడి నువ్వు మాతో మీటింగ్ ఏర్పాటు చేశావని మాకు తెలుసు. ఈ ఎన్నికలలో సీమాంధ్ర నుంచి కాంగ్రెస్ టిక్కెట్లు తీసుకోవడానికి మేమేమైనా పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నామా?

మీ పార్టీ నుంచి సీమాంధ్రలో పోటీచేసేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టే మాకు టిక్కెట్లు ఇస్తామంటున్నారు. మా అభిమానుల్లో ఇద్దరికో ముగ్గురికో టిక్కెట్లు ఇచ్చి, ఆ నెపంతో మా అభిమానులందరి చేతా కాంగ్రెస్ పార్టీకి అరవచాకిరీ చేయించాలనేదే నీ ప్లాన్ అనేది మాకు అర్థమైపోయింది చిరు అన్నయ్యా. వద్దన్నయ్యా.. మమ్మల్ని నీ రాజకీయాల్లోకి లాగి మా బుర్రలు తినే ప్రయత్నం చేయొద్దు. నీ రాజకీయా పుణ్యమా అని రాష్ట్రంలో ఇప్పటికే మా పరువు పూర్తిగా పోయింది. ఇంకా మమ్మల్ని హింసించకు. మా మానాన మమ్మల్ని బతకనీ. నీకూ, నీ రాజకీయాలకీ ఓ దణ్ణం.