కు.ని. ఔషధాల్లో ఎలుకల మందు

 

ఛత్తీస్‌గఢ్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి 13 మంది మహిళలు మరణించిన విషయం తెలిసిందే. ఈ శస్త్ర చికిత్సల సందర్భంగా ఉపయోగించిన మందుల శాంపిల్స్‌ని పోలీసు అధికారులు పరిశీలనకు పంపించారు. దుర్ఘటన జరిగిన రెండు వారాల తర్వాత సదరు మందుల శాంపిల్ రిపోర్టు వెలువడింది. ఆపరేషన్ సందర్భంగా మహిళలకు వాడిన మందులు అత్యంత నాసిరకం మందులని, వాటిలో ఎలుకల మందు (జింక్ ఫాస్పైట్) ఆనవాళ్ళు ఉన్నాయని ఆ శాంపిల్ రిపోర్టు పేర్కొంది. ఈ నివేదికను పోలీసు అధికారులకు అందజేశామని, ఈ కేసు విచారణను పోలీసులు కొనసాగిస్తారని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అమర్ అగర్వాల్ ప్రకటించారు. ప్రాణాలను కాపాడాల్సిన మందులలో విష పదార్ధాలు వుండటం చాలా తీవ్రమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.