పెళ్ళికి గెస్టుగా చిరుత

 

అంటే.. ఎవరైనా ప్రముఖులో, అభిమానులో పెళ్ళి చేసుకుంటుంటే ‘చిరుత’ రామ్‌చరణ్ హాజరయ్యాడని కాదు... ఉత్తర ప్రదేశ్‌లో ఓ పెళ్ళికి నిజంగానే చిరుతపులి వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలలోని ఠాకుర్ ద్వారా గ్రామంలో ఓ పెళ్ళి జరుగుతూ వుండగా, సమీపంలోని అడవి నుంచి ఓ చిరుతపులి పెళ్ళి మండపంలోకి వచ్చేసింది. ఇంకేముంది... పెళ్ళి మండపమంతా గందరగోళం అయిపోయింది. అతిథులంతా పెళ్ళి, విందు సంగతి మరచిపోయి బతికుంటే బలుసాకు తిని బతకొచ్చనుకుంటూ అక్కడి నుంచి పారిపోయారు. పెళ్లికొడుకు అయితే తన బంధువులందర్నీ చుట్టూ రక్షణ కవచంలా ఏర్పాటు చేసుకుని మరీ పారిపోయి దగ్గర్లో ఉన్న ఓ ఇంట్లో దాక్కున్నాడు. ఇక లాభం లేదనుకున్న పెళ్ళికూతురు బంధువులు దుడ్డుకర్రలు పట్టుకుని చిరుతని తరిమేశారు. ఆ తర్వాత ఇంట్లో దాక్కున్న పెళ్ళి కొడుకుని బయటకి పిలిచి పెళ్ళి జరిపించారు.