కొద్దిరోజుల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు: కొడాలి నాని

 

తెలుగుదేశం యువ నేత దేవినేని అవినాష్‌ వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. సీఎం జగన్ సమక్షంలో దేవినేని అవినాష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. నిన్న అవినాష్ వైసీపీలోకి చేరుతున్న కార్యక్రమానికి నాని హాజరు కాలేదు. ఆ నేపధ్యంలో ఆయన అభిప్రాయం అడిగారు మీడియా ప్రతినిధులు. నేడు ఇసుక స్టాక్ పాయింట్ ప్రారంభించడానికి వచ్చి అక్కడ నాని మాట్లాడుతూ... దేవినేని అవినాష్‌ను గుడివాడలో నిలబెట్టి.. రాజకీయ బలి పశువు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

చంద్రబాబు చేసిన ఇసుక దీక్షతో టీడీపీ ఎమ్మెల్యేలు విసుగుచెంది వైసీపీలోకి వస్తున్నారని చెప్పారు. టీడీపీ త్వరలో ప్రతిపక్ష హోదాను కోల్పోనుందని ధీమా వ్యక్తం చేశారు.  టీడీపీ హయాంలో ఇసుకను అడ్డంగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. గుడివాడ మండలం మల్లాయిపాలెంలోని ఇసుక స్టాక్ పాయింట్‌ను నాని ప్రారంభించారు. కాగా, 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్‌ గుడివాడ నుండి  వైసీపీ అభ్యర్థి కొడాలి పై పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొడాలి నాని జగన్ కేబినెట్‌లో మంత్రిగా పని చేస్తున్నారు.