మరో బీహార్‌గా ఆంధ్రప్రదేశ్... జగన్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పాలన టెర్రరిజాన్ని తలపిస్తోందన్న చంద్రబాబు... దాడులు, హత్యలతో ఆంధ్రప్రదేశ్ ను మరో బీహార్ గా మార్చేశారని మండిపడ్డారు. జగన్ ప్రకటించినవి నవరత్నాలు కాదని... నవ గ్రహాలంటూ బాబు విమర్శించారు. జగన్ ప్రభుత్వ విధానాలు అరాచకానికి పరాకాష్టగా మారాయన్న చంద్రబాబు... రివర్స్ టెండరింగ్ అంటూ మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అసలు పోలవరం ప్రాజెక్టు పనులను 5 నెలలపాటు ఎందుకు ఆపారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ వి మూర్కపు ఆలోచనలన్న చంద్రబాబు... అందుకే ప్రజావేదికను కూల్చి అరాచక పాలన చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అయినా, ప్రత్యేక హోదా గురించి జగన్‌ ఎందుకు మాట్లాడరని బాబు ప్రశ్నించారు.

ఏపీ ఖజానా దివాళా తీసే పరిస్థితికి జగన్ తీసుకొచ్చారని బాబు విమర్శించారు. నరేగా నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రభుత్వ డబ్బును వైసీపీ కార్యకర్తలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఇక, వైసీపీ నేతలు... ఇసుక స్మగ్లింగ్‌ చేస్తూ సామాన్యుల్ని రోడ్లపైకి తెస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో కసి కక్షగా మారుతుందని అన్నారు.