ఆగస్టు 24 నుండి బాబు బస్సు యాత్ర
posted on Jul 17, 2013 10:37AM
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తన 63 ఏళ్ల వయసులో దాదాపు 7 నెలలు పైగా రాష్ట్రంలో పలు జిల్లాలలో పాదయాత్ర చేసి పార్టీ శ్రేణులలోఉత్సాహం నింపారు. అదే సమయంలో ఆయన కూడా పాదయాత్ర తరువాత మరింత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో బస్సుయాత్రకు సిద్దం అవుతున్నారు. ఆయన చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను మాత్రం తన పాదయాత్రలో పర్యటించలేకపోయారు. అందువల్ల వచ్చేనెలలో బస్సుయాత్ర చేప్పట్టి ఆ జిల్లాలను కూడా పర్యటించాలని ఆయన సిద్దపడుతున్నారు. ఒకవేళ పంచాయితీ ఎన్నికల ఫలితాలు పార్టీకి సానుకూలంగా వస్తే అది తన యాత్రకు మంచి ఊపునిస్తుందని, అప్పుడు తన బస్సు యాత్ర ద్వారా ఆ తరువాత జరగనున్నమునిసిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నధం చేయవచ్చునని చంద్రబాబు ఆలోచన. ఆగస్టు 24 నుండి ఈ యాత్ర మొదలు కానుంది. ఈ మేరకు ఇంతకుముందే పార్టీ వర్గాలు ప్రకటన చేశాయి. వచ్చే సాధారణ ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండి వారికి దగ్గరగా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు.