చంద్రబాబు కూడా సీట్లు అమ్ముకుంటున్నాడట!

 

 

 

ఏ ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు మీద ఈ ఆరోపణ రాలేదు.. కానీ, ఈ ఎన్నికలలో మాత్రం చంద్రబాబు మీద ఈ ఆరోపణ వచ్చింది. ఇప్పటి వరకూ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి మీద, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు జగన్ మీద మాత్రమే టిక్కెట్లు అమ్ముకున్న ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. చంద్రబాబు మీద మాత్రం రాలేదు.

 

తాజాగా చంద్రబాబు మీద ఈ ఆరోపణ వచ్చింది. చంద్రబాబు టిక్కెట్లు అమ్మకుంటున్నారని ఆరోపించింది మరెవరో కాదు.. కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డి. తెలుగుదేశం ఇప్పటికి ఆరు లిస్టులు ప్రకటించినా అందులో లింగారెడ్డి పేరు లేదు. ప్రొద్దుటూరు టిక్కెట్ మరొకరికి కేటాయించారు.



తనకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదని ప్రశ్నించడానికి శనివారం లింగారెడ్డి చంద్రబాబు నాయుడిని కలిశారు. తనకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదని లింగారెడ్డి ప్రశ్నిస్తే చంద్రబాబు నుంచి మౌనమే సమాధానంగా ఎదురైందట. దాంతో లింగారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రొద్దుటూరి టిక్కెట్‌ని తనకు ఇవ్వకుండా మరొకరికి ఇచ్చారని, ప్రొద్దుటూరు టిక్కెట్‌ని అమ్ముకున్నారని ఆరోపించారు.