టీడీపీని విమర్శించేంత సీన్ టీఆర్ఎస్‌కి లేదు

 

తెలంగాణ ప్రజల మీద తనకు సంపూర్ణ నమ్మకం వుందని, తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందిస్తారన్న నమ్మకం తనకు వుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ‘‘ఓడినా ఉవ్వెత్తున ఎగసి విజయం సాధించగల సత్తా వున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు, అర్హత టీఆర్ఎస్‌కి లేవు. విభజన వల్ల ఇబ్బందులొస్తాయని, వాటిని పరిష్కరించండని మాత్రమే నేను చెప్పాను. తెలంగాణ ప్రజల మనోభావాలను కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బ్రహ్మాండమైన కార్యకర్తలు, నాయకులు వున్న పార్టీ టీడీపీ. ప్రజా సమస్యల మీద రాజీలేని పోరాటం చేస్తున్నది టీడీపీ. తెలుగుదేశం పాలన వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్‌లోకి వచ్చింది. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మేమే పోరాటం చేశాం.. మేమే దెబ్బలు తిని జైలుకు వెళ్ళాం.


సర్వమత సమ్మేళనానికి పుట్టినిల్లు కరీంనగర్ జిల్లా దేశం దశ, దిశ నిర్దేశించిన మహానుభావుడు పీవీ నరసింహారావు పుట్టిన గడ్డ ఇది. తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపేందుకు పుట్టినపార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణకు ఎక్కువ నీరు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. తెలంగాణకు రాజకీయ చైతన్యం తెచ్చింది తెలుగుదేశం పార్టీనే. మాదిగలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చింది టీడీపీనే. ఈసారి ఎన్నికలలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగిస్తుందన్న నమ్మకం వుంది’’ అన్నారు.