క్యాన్సర్‌తో మృతి చెందిన కేంద్ర మంత్రి

 

కేంద్ర మంత్రి, భాజపా సీనియర్‌ నేత అనంత్‌కుమార్ (59) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని శ్రీశంకర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.కేంద్ర మంత్రి పార్థివదేహాన్ని బెంగళూరులోని నేషనల్‌ కాలేజీలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.1959 జులై 22న బెంగళూరులో జన్మించిన ఆయన 1996 నుంచి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. 2014లో మోదీ మంత్రివర్గంలో ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వాజ్‌పేయీ హయాంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన మొత్తం ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

అనంతకుమార్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలాసీతారామన్‌,కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులు అనంతకుమార్‌ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.అనంతకుమార్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ.. దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని  పేర్కొన్నారు.