మంచు లక్ష్మి, బెల్లంకొండ మీద కేసులు...

 

నటుడు, నిర్మాత మోహన్‌బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి, నిర్మాత బెల్లంకొండ సురేష్ మధ్య ఆర్థిక సంబంధమైన వివాదం వున్న విషయం తెలిసిందే. ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా’ సెట్‌ ‘రభస’ చిత్రం కోసం వినియోగించుకున్నందుకు తనకు 58 లక్షలు ఇస్తామని చెప్పిన బెల్లంకొండ సురేష్ ఇప్పుడు ఇవ్వనంటున్నారంటూ మంచు లక్ష్మి మనుషులు మంగళవారం రాత్రి బెల్లంకొండ ఇంటిముందు ధర్నా చేశారు. దీనిమీద బెల్లంకొండ సురేష్ వివరణ ఇస్తూ, ‘‘గతంలో తన బ్యానర్‌లో మంచు విష్ణుతో ఓ చిత్రం తీసేందుకు రూ.60 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను. కథ సిద్ధం కాకపోవడంతో ఈ చిత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఆ డబ్బులను మంచు లక్ష్మీ ప్రసన్నకు ఇవ్వాల్సిందిగా మంచు విష్ణుకు చెబితే ఆయన సరేనన్నారు. కానీ, మంచు లక్ష్మీ ప్రసన్న మాత్రం అతనికి తనకు లింకు పెట్టొద్దనీ, తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎంతవరకు న్యాయం? మంచు లక్ష్మి, విష్ణు ఒకే కుటుంబానికి చెందినవారు కారా?’’ అన్నారు. ఈ విషయం మీద బెల్లంకొండ సురేష్ మీద మంచు లక్ష్మి, మంచు లక్ష్మి మీద బెల్లంకొండ సురేష్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు.