రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై ఛీటింగ్ కేసు నమోదు!!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై ఛీటింగ్ కేసు నమోదైంది. బీహార్‌లో ‘బాత్‌ బీహార్‌ కీ’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి యువతను కలుస్తానని ప్రశాంత్ కిషోర్ ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రశాంత్ కిషోర్ తన ఐడియాను కాపీ కొట్టి ఈ కార్యక్రమాన్ని రూపొందించారంటూ ఆయనపై ఓ యువకుడు చీటింగ్ కేసు పెట్టాడు. 

‘బాత్‌ బిహార్‌ కీ’ కార్యక్రమం తన ఆలోచన అని, ఈ ఐడియాను తన మాజీ సహోద్యోగి ఒసామా, ప్రశాంత్ కిషోర్ కు చెప్పాడని.. దీంతో ప్రశాంత్ కిషోర్ తన కంటెంట్‌ను దొంగిలించి వాడుకున్నారని.. శశ్వత్ గౌతమ్ అనే యువకుడు పట్నా నగరంలోని పాటలీపుత్ర పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేసాడు. ఇప్పటికే తాను ‘బిహార్‌ కీ బాత్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించానని తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు ఇచ్చాడు. గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాటలీపుత్ర పోలీసులు ప్రశాంత్ కిషోర్ తో పాటు ఒసామాపై ఐపీసీ సెక్షన్ 420, 406 ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.