అక్కని రోకలితో చంపేశాడు

 

కుటుంబ కలహాల కారణంగా ఓ తమ్ముడు అక్కని దారుణంగా హత్య చేశాడు. కృష్ణాజిల్లా కంకిపాడు ట్రాన్స్ కో కార్యాలయం ఎదుట ఈ ఘటన జరిగింది. గురువారం ఉదయం తన అక్క మీద సొంత తమ్ముడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించింది. కంకిపాడు పట్టణానికి చెందిన శివపార్వతి (37)కి తన తమ్ముడు నాగేశ్వరరావుతో గత కొంతకాలంగా వివాదాలున్నాయి. గురువారం ఉదయం వీరిద్దరి మధ్య ప్రారంభమైన వాగ్వివాదం ఘర్షణకి దారితీసింది. కోపం ఆపుకోలేని నాగేశ్వరరావు చేతికి అందిన రోకలితో తన అక్క తలపై మోదాడు. దాంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. ఆస్పతికి తరలించేలోపే మరణించింది. నిందితుడు నాగేశ్వరరావు పోలీసుల అదుపులో వున్నాడు.