బొత్స పొమ్మన్నారు .. రఘువీరా రమ్మంటున్నారు..

 

కాంగ్రెస్ నేతలు ఎప్పుడు ఎలా స్పందిస్తారో వారికే తెలియదు. రాష్ట్ర విభజన ప్రక్రియ ముగియక ముందు పీసీసీ చీఫ్ గా ఉన్న బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ నేతలు కొందరు ఇతర పార్టీల్లో కర్చీఫ్ లు వేసుకున్నారని ఆరోపించారు. వాళ్ళు ఎప్పుడో ఎందుకు.. ఇప్పుడే వెళ్లిపోవచ్చని ఆగ్రహోదగ్రుడైపోయాడు. సత్తిబాబు కమిట్మెంట్ చూసి కాంగ్రెస్ ను ఎవరూ కదిలించలేరనుకున్నారు. విభజన పూర్తయ్యేసరికి సత్తిబాబు చేతులెత్తేశారు. బొత్స బంధువులు, నమ్మిన బంట్లు కూడా వేరే పార్టీల వైపు చూస్తున్నారు. పురపాలక ఎన్నికల్లో నామినేషన్లు వేసేవారు కూడా లేకపోవడంతో సీమాంధ్ర పీసీసీ చీఫ్ భాద్యతలు స్వీకరించిన రఘువీరా ఖాళీ అయిన కాంగ్రెస్ దుకాణంలో కొత్త షావుకారులా కూర్చున్నారు. వార్డు మెంబర్ గా కాంగ్రెస్ టికెట్ పొందాలంటే ఢిల్లీ స్థాయి పైరవీలు చేయాల్సి ఉండేది. ఇప్పుడేమో కార్యకర్తలైనా ఫర్వాలేదు. టికెట్కు దరఖాస్తు చేసుకొండంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు రఘువీరా. మరో అడుగు ముందుకేసి పార్టీని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ఇంతలో ఎంత మార్పు అని ముక్కున వేలేసుకుంటున్నారు జనాలు.