ఎన్నికల వేళ బీజేపీ కార్యాలయం కళకళ

 

ఎన్నికల వస్తున్నాయంటే ఆశావహులు పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు.తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కార్యాలయం,బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రి దత్తాత్రేయ నివాసం కూడా ఆశావహుల హడావుడితో కళకళలాడుతూ కనిపిస్తున్నాయి.బీజేపీ తెలంగాణలో 119 చోట్ల పోటీ చేస్తున్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల నుంచి టికెట్ల కోసం చాలామంది పోటీ పడుతున్నారు.దీంతో రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ ఆశావహులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ను కలిసేందుకు ముషీరాబాద్‌లోని క్యాంపు కార్యాలయానికి వస్తుండటంతో హడావిడి నెలకొంది.లక్ష్మణ్‌ను కలిసి తమ బయోడేను అందచేసి,ఫలానా నియోజకవర్గం నుంచి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. తర్వలో ప్రకటించే రెండో జాబితాలో తమ పేరు ఉండేలా చూడాలని కోరుతున్నారు.టికెట్లు ఆశిస్తున్న వారు వివిధ పార్టీల నేతలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో పార్టీలో చేర్చేందుకు తీసుకొస్తున్నారు.పెద్ద ఎత్తున నాయకులు రావటం,పార్టీలో చేరుతుండటంతో వీరందరి కోసం కార్యాలయం ఆవరణలో ప్రత్యేక షెడ్డును సైతం ఏర్పాటు చేశారు.


బీజేపీ సీనియర్ నాయకుడు మంత్రి దత్తాత్రేయ నివాసం కూడా నేతలు, కార్యకర్తలతో కిలకిటలాడుతోంది.పార్టీ కోసం తాము చేపట్టిన కార్యక్రమాల వివరాలతో పాటు బయోడేలాలను సమర్పించి వెళ్తున్నారు.జంటనగరాలతోపాటు వివిధ జిల్లాల నుంచి టికెట్‌ ఆశిస్తున్న నేతలు వచ్చి కలుస్తున్నారు.బీజేపీ ఓబీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు కాటం నర్సింహులు యాదవ్‌ ఆధ్వర్యంలో పలువురు బీసీ సభ్యుల బృందం దత్తాత్రేయను కలిసి బీసీలకు జనాభాకు అనుగుణంగా 50 సీట్లు కేటాయించాలని కోరారు. ఓబీసీ సెల్‌ తరుపున అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకు అవకాశం కల్పించాలని 10మంది పేర్లతో కూడిన జాబితాను సమర్పించారు.