తెలంగాణలో పవన్ ని రంగంలోకి దింపుతున్న బీజేపీ!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినిమాల పరంగా మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. రాజకీయాలలో మాత్రం అంతంత మాత్రమనే చెప్పాలి. ఎమ్మెల్యేగా గెలవ లేకపోయినా ఆయన సభలకు వేలాదిమందిగా జనం వస్తుంటారు. ఈ ఫాలోయింగ్ వాడుకోవాలని.. దాంతో బిజెపి విధానాలనూ జనంలోకి బలంగా తీసుకెళ్లాలనేది బీజేపీ జాతీయ నాయకత్వం ప్లాన్. ఇదే విషయం ఇరు తెలుగు రాష్ట్రాల బీజేపీ శ్రేణులకు సూచించారట బీజేపీ జాతీయ నేతలు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే రాజధాని అంశంపై జనసేనతో కలిసి పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది బిజెపి. తెలంగాణలో కూడా  పవన్ తో కలిసి పని చేస్తామని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. దీంతో జనసేనాని సేవలను వినియోగించుకోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అదేవిధంగా పవన్ తో కలిసి పోరాటాలు చేయడం వల్ల తెలంగాణ బీజేపీకి దీర్ఘకాలంలో నష్టం ఉంటుందంటున్నారు కొంత మంది నేతలు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ సెంటిమెంట్ ఇంకా జనంలో ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర లీడర్ వచ్చి టిఆర్ఎస్ ను గానీ.. కేసీఆర్ నుగానీ విమర్శిస్తే మొదటికే మోసం వస్తుంది అనేది కొంత మంది నేతల వాదన. ప్రస్తుతం బిజెపి రెండు కార్యక్రమాల్ని చేపట్టింది. సీఏఏను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం తెలంగాణ ప్రభుత్వ పని తీరు, పథకాలను నిశితంగా పరిశీలిస్తూ లోపాలను ఎండగట్టడం ఈ రెండు కార్యక్రమాల్లో పవన్ ను పాల్గొనేలా చేస్తే కొత్త ఇబ్బందులు తప్పవని బీజేపీలో కొందరు చెప్తున్నారు.

అంతేకాకుండా పవన్ ను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావటం వల్ల జాతీయస్థాయి నేతలైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్య దర్శి మురళీధర్ రావుల ప్రభావాన్ని తగ్గించిన వారౌతామని కూడా అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ను దూరంగా ఉంచితేనే మంచిదని సలహాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వివిధ కారణాలు తెరమీదకు వస్తున్నాయి. ముఖ్యంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపితో పొత్తు వల్లనే కాంగ్రెస్ నష్ట పోయిందని ఇప్పుడు పవన్ తో కలిసి వెళ్తే.. అదే పరిస్థితి బిజెపికి ఎదురౌతోందని గుర్తు చేస్తున్నారు. భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న ఈ సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ సేవలను తెలంగాణ బీజేపీ వినియోగించుకుంటుందా? లేకా కొత్త తలనొప్పులు తెచ్చుకుంటుందా? అనేది తెలియాల్సి ఉంది.