కలకలం రేపుతోన్న జగన్ ఢిల్లీ టూర్ డిటైల్స్
posted on Feb 16, 2020 11:01AM
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కరోజు గ్యాప్లో రెండుసార్లు ఢిల్లీ వెళ్లిన జగన్.... ప్రధాని మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలవడంపై పెద్దఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వైసీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించారని, త్వరలోనే కేంద్ర కేబినెట్లో చేరబోందన్న ప్రచారంతో... అధికార వైసీపీ... ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అదే సమయంలో, ఢిల్లీ పరిణామాలపై ఏపీ బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వైసీపీ ...నిజంగా ఎన్డీఏలో చేరుతుందో లేదో తెలియదు గానీ, వార్తలు మాత్రం రాజకీయంగా మాత్రం కలకలం సృష్టిస్తున్నాయి. వైసీపీ... ఎన్డీఏ అండ్ కేంద్ర కేబినెట్లో చేరుతుందంటూ విస్తృత ప్రచారం జరుగుతుండటంతో తెలుగుదేశం తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. సీబీఐ అండ్ ఈడీ కేసుల నుంచి తప్పించుకోవడానికే ఎన్డీఏలో చేరుతున్నారంటూ ఆరోపిస్తోంది. ఇక, సెక్యులరిజం పేరుతో ముస్లిం మైనారిటీ దళితుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి.... ఇకనైనా ముసుగు తీయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగుదేశం విమర్శలతో డిఫెన్స్లో పడిన వైసీపీ.... ఎన్డీఏలో చేరతామంటూ జరుగుతోన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. మొదట్నుంచీ జగన్కు బీజేపీ రంగు పులిమి, ముస్లిం మైనార్టీ దళితులను వైసీపీకి దూరంగా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడుతున్నారు. బీజేపీతో వైసీపీ ఎట్టిపరిస్థితుల్లోనూ జగకట్టబోదని డిప్యూటీ సీఎం అంజద్ బాషా చెప్పుకొచ్చారు. అయితే, తమకున్న సమాచారం ప్రకారం వైసీపీతో ఎలాంటి మైత్రి ఉండబోదని ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవదర్... అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. ఏపీ బీజేపీ సారధుల మాట ఇలాగుంటే, ఆ పార్టీ టీజీ వెంకటేశ్ మాత్రం... ఏమో ఏమైనా సాధ్యమేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే, వైసీపీ.... ఎన్డీఏలో చేరొచ్చంటూ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, టీడీపీ అనుకూల మీడియా కావాలనే తన మాటలను వక్రీకరించిందని మంత్రి బొత్స మండిపడుతున్నారు. అయితే, బొత్స మాట మార్చారని, డ్యామేజ్ జరగడంతోనే ఇప్పుడు వైసీపీ నేతలంతా ఖండిస్తున్నారని సీపీఐ రామకృష్ణ మండిపడుతున్నారు. మొత్తానికి, ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ అనేక ఊహాగానాలకు తావిచ్చింది. ఒక్కరోజు గ్యాప్లో రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి... ప్రధాని మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలవడంతో ఆంధ్రా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.