రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు.. డిసెంబర్ 12న కాంగ్రెస్ కి నామం

 

బీజేపీయేతర పార్టీలను ఒక తాటి మీదకు తీసుకొచ్చే పనిలో భాగంగా ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీపై బీజేపీ అప్పుడే విమర్శలు మొదలుపెట్టింది. తాజాగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చంద్రబాబు ఢిల్లీ పర్యటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారని, అందువల్లే రాహుల్ గాంధీని కలిశారని అన్నారు. రాహుల్ గాంధీ, చంద్రబాబుల భేటీ కేవలం కూటమి ఏర్పడబోతుందని సంకేతాలివ్వడానికేనని చెప్పుకొచ్చారు. పొత్తుపెట్టుకోవడం ఫలించకపోతే ఆ పార్టీలకు నామం పెట్టడం చంద్రబాబుకు అలావాటేనని విమర్శించారు. డిసెంబర్ 12న కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నామం పెడతారని జోస్యం చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్ తో కలిసి చారిత్రక తప్పిదం చేశామని చంద్రబాబు అంటారని విమర్శించారు. రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారని.. అంతే తప్ప అందులో ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు.