టీఆర్ఎస్ నేత కుమారుడి భూకబ్జా బాగోతం..!!

 

టీఆర్ఎస్ నేత కుమారుడు ఓ స్థలం కబ్జా వివాదంలో చిక్కుకున్నారు.బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఉమెన్ కోపరేటివ్ సొసైటీకి చెందిన స్థలాన్ని కొంత మంది వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని,దొంగ డాక్యుమెంట్లు తెచ్చి, చదును చేసి,స్థలం తమదని వాదిస్తున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి చదును చేస్తున్నవారిని అదుపులోకి తీసుకొని ఆరా తీయగా స్కెచ్ అంతా టీఆర్ఎస్ నేత కే.కేశవరావు కుమారుడు వెంకట్ కుమార్‌దిగా తేలింది.విషయం తెలుసుకున్న కేకే,ఆయన కుమారుడు పోలీసులకు ఫోన్ చేసి తాము ఆ స్థలానికి సంబంధించిన వాళ్లతో రాజీకి వచ్చామని, కేసు నమోదు చేయవద్దని, విషయాన్ని బయటపెట్టవద్దని కోరినట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత కావడంతో పోలీసులు కూడా సైలెంట్‌ అయినట్లు సమాచారం.కేకే కుమారుడు కబ్జా చేయబోయిన భూమికి సంబంధించిన వివాదాలు ఇప్పటికే కోర్టుల్లో ఉన్నాయి.రెండేళ్లుగా కోర్టులో కేసు ఉన్నప్పటికీ ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల వేడి ఉండటంతో కేకే కుమార్తె విజయలక్ష్మి ఖైరతాబాద్ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న కారణంగానే కబ్జా ప్రయత్నంలో కేకే కుమారుడు వెనుకడుగు వేసినట్లు సమాచారం.