బాధ్యతగా చేయూతనిద్దాం! ఇంటి వద్దకే ఆహారం అందిద్దాం!

ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారి తో విలవిలలాడుతున్న సందర్భంలో లాక్ డౌన్ సమర్థంగా అమలయ్యేలా చూసేందుకు సామాజిక బాధ్యతగా బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఐదుగురు ఆహారం అందించే ప్రణాళికలో ముందుకు సాగాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. సోమవారం ఆయన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జీ లతో టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వివిధ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న  కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని, కట్టడి చేసేందుకు పేద, బడుగు, సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకులు, ఆహార సమస్య తలెత్తకుండా చూసుకోవాల్సిన సామాజిక బాధ్యత బిజెపి కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. అందుకు జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, నగరాలు, పట్టణాల, మండలాల వారీగా ప్రణాళికాబద్ధంగా నిరుపేదలకు వలస కూలీలకు నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలను అందించే బాధ్యతను సమర్థంగా అమలు చేయాలని రాష్ట్రపదాధికారులకు, జిల్లా అధ్యక్షులకు, జిల్లా ఇన్చార్జిలకు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

బిజెపి జాతీయ అధినాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశానుసారం  కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు, నిర్మూలించేందుకు ప్రతి బీజేపీ కార్యకర్త క్షేత్రస్థాయిలో ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య నాయకులకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ వ్యక్తిగతంగా ఫోన్లో సంభాషించి కార్యక్రమాల అమలు తీరుపై దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల అమలు తీరుపై ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి నివేదికలు సమర్పించాలని పార్టీ నాయకులను ఆదేశించారు.