వన్ మోర్... వైసీపీ గూటికి చేరనున్న బాలయ్య ఆప్తమిత్రుడు

ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూ రావు.. తొలి నుంచి టిడిపి నాయకుడుగా, నందమూరి బాలకృష్ణకు మంచి ఆప్తమిత్రుడిగా పేరు సంపాదించుకున్నారు. తనకు సీటు ఇచ్చే విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కాదన్నా బాలయ్య దగ్గర చక్రం తిప్పి తాను తలుచుకున్న చోట సీటును సాధించడంలో కదిరి బాబు నేర్పరి కావడంతో టిడిపిలో ఆయనకు తిరుగులేకుండా పోయింది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో గానీ వైసిపిలో చేరే ఆలోచనలో ఉన్నారని జనాలు అనుకుంటున్నారు. 

15 ఏళ్ల క్రితం 2004 లో టిడిపిలో చేరి నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో టిడిపి అభ్యర్థిగా సీటు సాధించి దర్శి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు కదిరి బాబూరావు. అనంతరం 2009 లో తన రాజకీయ మకాంని సొంత నియోజకవర్గమైన కనిగిరికి మార్చి 2009 లో మరోసారి బరిలో నిలిచేందుకు ప్రయత్నించారు. ఎన్నికల అఫిడవిట్ లో సాంకేతిక కారణాలు తలెత్తడంతో డిస్ క్వాలిఫై కావడంతో చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయారు. 2014  లో మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి విజయం సాధించి తన చిరకాల కోరికను తీర్చుకున్నారు ఆయన. 2019 లో కనిగిరి నుంచి మరోసారి పోటీ చేసేందుకు ప్రయత్నించగా చంద్రబాబు నో చెప్పడంతో దర్శి నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఈ ఎన్నికలలో టిడిపి ఘోరపరాజయంపాలైంది. 

తాను ఆశించిన కనిగిరి కాకుండా తనకు ఇష్టం లేని పెళ్లి చేసినట్టు దర్శిని కట్టబెట్టడంతో అధినేత చంద్రబాబుపై బాబురావు గుర్రుగా ఉన్నారు. అందుకే అటు బీజేపీ గానీ ఇటు వైసీపీలోకి గాని వెళ్లాలని నిర్ణయించుకొని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారంటున్నారు. ఇప్పుడు ఆకస్మాత్తుగా తాడేపల్లిగూడెంలో తన సామాజిక వర్గానికి చెందిన కొందరు కీలక నేతలు భేటీ కావడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అక్కడికి వెళ్లారు. ఏమైందో ఏమో తెలీదు గానీ ఇప్పుడు జంక్షన్ లో నిలబడిపోయి దిక్కుల చూస్తున్నారు. అటు బీజేపీ లోకి వెళ్లలేక ఇటు వైసిపి లోకి వెళ్లే ఛాన్స్ లేక పోవడంతో ఏం చేయాలో తేల్చుకోలేక పోతున్నారు బాబూ రావు. కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఉండగా తాను మనుగడ సాధించడం కష్టమని భావిస్తున్నారు. మరోవైపు టిడిపిలో కూడా తన పదవికి ఎసరు తెచ్చుకొని ఎటెళ్లాలో తెలియక జంక్షన్ లో జామ్ అయిపోయారంటున్నారు. ఇప్పుడు ఉన్న పార్టీ లోనే తన క్లియర్ చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారనే ప్రచారం సాగుతోంది. 

పార్టీకి సమాచారం ఇవ్వకుండా తాడేపల్లిగూడెంలో కాపు నాయకులతో భేటీ కావడంతో పార్టీ మార్పుపై చర్చ జరుగుతోంది. ఆయన మీద గుర్రుగా ఉన్న టిడిపి మరోసారి దర్శి బాధ్యతలనూ చూసుకునే బాధ్యతను అనధికారికంగా శిద్ధా రాఘవరావుకూ అప్పగించారు. శిద్దా రాఘవరావు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండటంతో తన స్థానానికి ఎసరొచ్చేలా ఉందని కదిరి బాబురావు ఆందోళనలో పడ్డారు. నియోజక వర్గ కార్యకర్తలతో జరిగిన సమావేశాల్లో తానే ఇన్చార్జినని శిద్దా కాదని చెప్పుకుంటున్నారు. ఇక పై తాను చెప్పినట్లే కార్యకర్తలు నడవాలని తెలుగు తమ్ముళ్లకు హుకుం కూడా జారీ చేశారు. దీంతో ఇప్పుడు దర్శిలో శిద్దా కదిరిల మధ్య వార్ మొదలైందని తమ్ముళ్లు అనుకుంటున్నారు. మొత్తానికి ఇలా కంటిన్యూ అయిపోతూ అవకాశం వచ్చినప్పుడు బీజేపీలో చేరేందుకు ప్రయత్నించాలనీ కదిరి భావిస్తున్నారు. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.