సమరానికి సై అంటున్న లెజెండ్

 

నటసింహం లెజెండ్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. చిత్రం భారీ విజయం సాధించడంతో దేవుళ్ళకు మొక్కులు, ప్రేక్షక దేవుళ్ళకు కృతజ్ఞతలు తెలిపేందుకు లెజెండ్ టీం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది. విశాఖపట్నం చేరుకుని సింహాచలం అప్పన్నను దర్శించుకున్న బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో బావ చంద్రబాబుతో సమావేశం కానున్నానని తెలిపారు. పార్టీ నాయకత్వం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు బాలయ్యబాబు.

 

బాలకృష్ణ అసెంబ్లీ కి పోటీ చేస్తారా, పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగుతారా అనేది స్పష్టం కాకపోయినా ఎమ్మెల్యేగా పనిచేసేందుకే నందమూరి నాయకుడు మొగ్గు చూపుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. సెంటిమెంట్ ప్రకారం అయితే అంతపురం జిల్లా హిందూపురం, కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గాలలో ఏదో ఒక చోటు నుంచి బాలయ్య పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అంటున్నారు. ఇవే కాకుండా కృష్ణా జిల్లాలోని గన్నవరం, పెనమలూరు, నూజివీడు నియోజకవర్గాల అభిమానులు కూడా తమ ప్రాంతం నుంచి బాలయ్య పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.