కాంగ్రెస్ లోనే ఉంటానన్న బాడిగ

 

రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడాలని భావించిన మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ మనసు మార్చుకున్నారు. మళ్లీ తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఆయన బాటలోనే మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ నడిచారు. బాడిగ రామకృష్ణ మచిలీపట్నంలోని తన ఆఫీసులో కార్యకర్తలతో ఓ సమావేశం నిర్వహించారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాడిగను కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కోరారు. కాంగ్రెస్ నుంచి నాయకులు పోయారే తప్ప కార్యకర్తలు ఎక్కడికి వెళ్లలేదని, తామంతా బాడిగ కావాలనే కోరుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలిసి తామంతా బాధపడినట్లు చెప్పారు. ఈసారి ఎన్నికల్లో బందరు నుంచి పోటీచేస్తే గెలిపిస్తామని అన్నారు. అయితే, పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అంత అనుకూలంగా లేవనే అభిప్రాయాన్ని బాడిగ వ్యక్తం చేసినా వాళ్లు మాత్రం పట్టు వీడలేదు. కాంగ్రెస్‌ పార్టీలో ఉండేదీ లేనిదీ చెప్పాలంన్నారు. మీరంతా కోరుతుంటే కాదనలేనని గడ్డుకాలంలో కాంగ్రెస్‌ను వీడడం తనకు ఇష్టం లేదని చెప్పిన బాడిగ చివరకు కాంగ్రెస్‌కు జై కొట్టారు. సమావేశానికి హాజరైన బూరగడ్డ వేదవ్యాస్ కాంగ్రెస్‌తోనే పయనమని ప్రకటించారు.