పెట్రోల్ ధరపై ప్రశ్నించినందుకు ఆటో డ్రైవర్ని నెట్టేసిన బీజేపీ నేత

 

అసలే కోపంతో రగిలిపోతుంటే ఇంకాస్త పెట్రోల్ పోసి ఆ కోపాన్ని రెట్టింపు చేస్తున్నట్లుంది బీజేపీ పరిస్థితి.. ఓ వైపు పెట్రోల్ ధరలు మండిపోతూ ప్రజలకు కోపం తెప్పిస్తుంటే.. మరోవైపు ఇవేం ధరలు అని ప్రశ్నించిన ఆటో డ్రైవర్ని నెట్టేసి ఆ కోపాన్ని రెట్టింపు చేసారు ఓ బీజేపీ నేత.. చెన్నైలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళసాయి సౌందరరాజన్‌ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆమె వెనకే ఉన్న ఓ ఆటోడ్రైవర్‌ పెట్రోల్‌ ధరలపై ప్రశ్నించారు.. దీంతో అక్కడే ఉన్న మరో బీజేపీ నేత కాళిదాస్‌ అసహనంతో ఆ ఆటోడ్రైవర్‌ను అందరూ చూస్తుండగానే నెట్టివేశారు.. ఈ దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో వైరల్‌గా మారాయి.. బీజేపీ నేతల తీరుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. ప్రశ్నించినందుకే తోసేస్తారా? అంటూ మండిపడుతున్నారు.. ఈ ఘటన అనంతరం ఆ ఆటోడ్రైవర్‌ మీడియాతో మాట్లాడుతూ.. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలతో తనలాంటి ఆటోడ్రైవర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపాడు.. రోజు ఆటో కిరాయి, పెట్రోల్‌ ఖర్చులు పోను తమకు ఏమీ మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.