గుంటూరులో కలకలం.. ప్రేమను ఒప్పుకోలేదని ఆర్మీ జవాన్ కాల్పులు!

గుంటూరు జిల్లాలోని చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో ఓ ఆర్మీ జవాన్‌ కాల్పులు జరపడం కలకలం రేపింది. నాటు తుపాకీతో అతను కాల్పులకు తెగపడ్డాడు. ఈ కాల్పుల్లో రమాదేవి అనే మహిళ గాయపడింది. కాల్పులు జరిపిన ఆర్మీ జవాన్‌ బాలాజీ అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికులు వెంటనే గాయపడ్డ మహిళను తెనాలి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. బాలాజీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ కాల్పులకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. రమాదేవి కూతురిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేయాలనీ అంటూ బాలాజీ కొంతకాలంగా వెంటపడుతున్నాడు. ఇందుకు రమాదేవి ఒప్పుకోలేదు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న బాలాజీ.. ఉదయం ఆమె ఇంటికి వెళ్లి.. నాటు తుపాకీతో కాల్పులు జరిపి రమాదేవిని చంపేందుకు యత్నించాడు. అయితే ఆమె చాకచక్యంగా కాల్పుల నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీసి, ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనలో ఆమె కుడి చెవికి బుల్లెట్ గాయమైంది. కాల్పుల శబ్దం విని.. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో.. బాలాజీ అక్కడి నుంచి పరారయ్యాడు.