ఏపీపీఎస్సీ సభ్యుడా.. జగన్ పార్టీ కార్యకర్తా?

 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు కొందరు ఉద్యోగాలు అమ్ముకొని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినప్పుడే దాని పరువు గంగలో కలిసిపోయింది. అదొక రాజకీయ పునరావాస శిబిరంగా మారిపోయింది. ఇప్పుడు అదే విషయం మరోసారి రుజువైంది. కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక ఎన్నికల సమరంలో ఏపీపీఎస్సీ సభ్యుడు డాక్టర్ ఎస్ఎండీ నౌమాన్ వైసీపీ తరపున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతుగా నౌమాన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయనను ఏపీపీఎస్‌సీ సభ్యుడిగా నియమించారు. కాంగ్రెస్‌లో ఉన్న శిల్పామోహన్‌రెడ్డి టీడీపీ గూటికి చేరారు. శిల్పాతో విభేదాల కారణంగా నౌమాన్ రెండు వారాల క్రితం హైదరాబాద్‌లో జగన్‌తో కలిశారు. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు అత్యధికంగా ఉన్న పాతబస్తీలో ప్రచారానికి వైసీపీ నాయకులు నౌమాన్‌ను రంగంలోకి దించారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన సాగుతున్నా ఏపీపీఎస్‌సీ పదవికి రాజీనామా చేయకుండానే వైసీపీ తరపున ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది.