వైసీపీ మంత్రుల ఫోటోల లీక్.. ఇలా దౌర్జన్యం చేయడం కోసమే లైవ్ ఆపేశారా?

శాసన మండలిలో వైసీపీ సభ్యులు, మంత్రులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలి చైర్మన్ పోడియం ముందు ఆందోళన చేస్తున్న మంత్రుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మంత్రుల తీరుపై నెటిజనులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ఫోటోలలో మంత్రులు కొడాలి నాని, బొత్స సత్యనారాయణ తదితరులు.. చైర్మన్ పోడియం ముందు కుర్చీలు, బల్లలపై నిల్చొని.. వేళ్లు చూపిస్తూ బెదిరిస్తున్నట్టుగా ఉన్నాయి. దీంతో ఇలా మండలి చైర్మన్ ని బెదిరించి దౌర్జన్యం చేయడం కోసమే.. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారా? అంటూ అధికార పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు అయ్యుండి ఇలా కుర్చీలు, బల్లలు ఎక్కి బెదిరింపులకు పాల్పడటం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.