జగన్ సర్కారు వివాదాస్పద నిర్ణయం.. చంద్రబాబు నిర్ణయాలపై సిట్ దర్యాప్తు...

అమరావతి భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ప్రకారం విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి నేతృత్వంలో 10మంది సభ్యులతో సిట్‌‌ను నియమించారు. రాజధాని భూ-లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక ఇవ్వడంతో... ప్రత్యేక దర్యాప్తు బృందం సమగ్ర విచారణ జరపనుంది.

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లు, అన్నింటిపైనా సమగ్ర విచారణకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు చేపట్టనుంది. గత ఐదేళ్లలో ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి ఎవరినైనా విచారణకు పిలిచే, ప్రశ్నించే అధికారం సిట్‌కు ఉందంటూ జీవో జారీ చేసింది. గత ప్రభుత్వ నిర్ణయాలను, పథకాలను తిరగదోడేందుకు జగన్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సీఆర్డీఏ పరిధిలో భూలావాదేవీలు సహా అన్ని ప్రభుత్వ పథకాలు, కార్పొరేషన్ల వ్యవహారాలు సిట్‌ పరిధిలోకి వస్తాయంటూ జీవోలో స్పష్టం చేసింది.

అమరావతిలో చోటుచేసుకున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, భూముల లావాదేవీలపై విచారించనుంది. అలాగే మంత్రివర్గ ఉపసంఘం నివేదికను విచారించి, పరిశోధించి, క్రిమినల్ కేసులు పెట్టే అధికారం కూడా సిట్‌కు కట్టబెట్టింది. ఈ క్రమంలో అవసరమైతే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని ఇతర విచారణ సంస్థల సహాయం తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ తిరగదోడేందుకు సిట్‌ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.