అన్న క్యాంటీన్లే ఉండుంటే.. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ..

ఏపీలో గతేడాది వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను నిర్దాక్షిణ్యంగా మూసేసింది. ఐదు రూపాయలకే అన్నార్తులకు కడుపు నింపే అన్న క్యాంటీన్ల మూసివేతపై ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి వాటిని రాజన్న క్యాంటీన్లుగా పేరు మార్చుకుని వాడుకోవచ్చుగా అంటే కూడా సమాధానం చెప్పలేని పరిస్దితి ప్రభుత్వానిది. ఏదో రకంగా టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని కొనసాగిస్తే అంతిమంగా వారికే మంచిపేరు వస్తుందన్న ఆక్రోశమే ఇందులో కనిపించింది.

కానీ తెలుగు రాష్ట్రాల్లో కరోనా  వైరస్ ప్రభావం పెరుగుతుందని తెలియగానే, తెలంగాణ సర్కారు వెంటనే లాక్ డౌన్ కారణంగా మూతపడిన అన్నపూర్ణ క్యాంటీన్లను తెరవడమే కాకుండా ఐదు రూపాయలకు కూడా తీసుకోకుండా ఉచితంగా భోజనం అందించేందుకు సిద్దపడింది. కానీ అదే సమయంలో ఏపీలో లాక్ డౌన్ కారణంగా వేలాది మంది యాచకులు, పేదలు ఆకలి కేకలు వేస్తుంటే ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తున్న పరిస్దితి ప్రస్తుతం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా అన్న క్యాంటీన్లు ఉండి ఉంటే అనే చర్చ సాగుతోంది. 

 

 

రాజకీయ కారణాలతో మూసేసిన అన్న క్యాంటీన్లను సంక్షోభ సమయంలో తెరిచేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోయినా ఇప్పుడు రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్ధలు ఈ బాధ్యతను నెత్తికెత్తుకున్నాయి. లాక్ డౌన్ అమలవుతున్నా సరే.. అందిన కాడికి విరాళాలు సేకరించి మరీ అన్నార్తుల కడుపు నింపుతున్నాయి. వీరే లేకుంటే ఏపీలో కరోనా చావుల కంటే ఆకలి చావులే ఎక్కువగా ఉండేవన్న వాదన వినిపిస్తోంది. స్వచ్ఛంద సంస్ధలు, సామాజిక కార్యకర్తలు పేదల కడుపు నింపడాన్ని చూసిన వారంతా ప్రభుత్వం చేయాల్సిన పనిని నెరవేస్తున్న వీరిన్ అభినందించకుండా ఉండలేని పరిస్దితి. పలుచోట్ల వీరికి అవసరమైన విరాళాలు ఇచ్చేందుకు సైతం ప్రజలు ముందుకొస్తున్నారు.