చిత్తూరు నుంచి అమ్మఒడి... మాట నిలబెట్టుకున్న జగన్...
posted on Jan 9, 2020 8:56AM
మరో చారిత్రక పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. నవరత్నాల్లో అత్యంత ముఖ్యమైన అమ్మఒడి పథకాన్ని చిత్తూరు నుంచి శ్రీకారం చుట్టారు. చదువుకు పేదరికం ఆటంకం కాకూడదన్న గొప్ప ఆలోచనతో ప్రవేశపెట్టిన ఈ పథకంతో... దాదాపు 43లక్షల మందికి లబ్ది చేకూరనుంది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్... పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ...ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదువుకునే విద్యార్ధులకు ఏటా 15వేల రూపాయలు అందజేయనున్నారు. అయితే, నగదును పిల్లల తల్లుల అకౌంట్స్లో జమచేయనున్నారు. ఈ పథకం అమలు కోసం ఈ ఏడాది 6వేల 500కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. అమ్మఒడి పథకం వల్ల డ్రాపౌట్లు తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే, ప్రతి ఒక్కరూ చదువుకోవడం వల్ల ఆయా కుటుంబాలు పేదరికం నుంచి బయటపడి అభివృద్ధిలోకి వస్తాయని భావిస్తోంది.
మొత్తానికి, నేను విన్నాను... నేను ఉన్నాను అంటూ... పాదయాత్రలోనూ, ఎన్నికల్లోనూ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకేస్తున్నారు. అందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జగనన్న అమ్మఒడి పథకాన్ని చిత్తూరు నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు.